ఓటుకు నోటిచ్చాడనే కృతజ్ఞత అక్కర్లేదు: రాంగోపాల్ వర్మ

  • అలా చేస్తే మీకు మీరు ద్రోహం చేసుకున్నట్లేనని వ్యాఖ్య
  • ఓటేయడానికి డబ్బులు తీసుకోవద్దని చెప్పబోనన్న డైరెక్టర్
  • అవసరానికి డబ్బులు తీసుకున్నా సరే నిజాయతీ గల నేతను ఎన్నుకోవాలని సూచన
ఓటు వేయాలంటూ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దని తాను చెప్పబోనని, అయితే నోట్లు ఇచ్చిన నేతపై కృతజ్ఞత చూపాలనే ఆలోచన మాత్రం చేయకండని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ ఓటర్లకు సూచించారు. డబ్బులు తీసుకున్నాననే కృతజ్ఞత చూపాలనుకోవడం మీకు మీరు చేసుకుంటున్న ద్రోహమని చెప్పారు. ఓటును కొనుక్కోవాలని చూడడం సదరు నేత చేసిన నేరమని, నేరస్థుడిపై జాలి కానీ, కృతజ్ఞత కానీ చూపాల్సిన అవసరం లేదని హితవు పలికారు.

ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ చిత్రకారుడు రమణరెడ్డి ఏర్పాటు చేసిన ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కార్టూన్‌ చిత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓటును అమ్ముకోవద్దని, నోట్లు తీసుకోవద్దని తాను చెప్పబోనని వ్యాఖ్యానించారు. మనకు అవసరం లేదు కాబట్టి మనం తీసుకోవట్లేదు, అవసరం ఉన్న వారు తీసుకుంటారు.. అందులో తప్పేం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు తీసుకున్నా సరే మీకు మంచి చేసే వ్యక్తికి ఓటేయండని రాంగోపాల్ వర్మ సూచించారు.




Ram Gopal Varma
Note for Vote
Telangana Polls
Advice To Voters
Telangana
Telangana Assembly Election

More Telugu News